Wednesday, 31 January 2018

దైవప్రీత్యర్థం విధ్యుక్తధర్మాచరణం

దైవప్రీత్యర్థం విధ్యుక్తధర్మాచరణం

మానవులు జన్మనుసార్థకంచేసుకోవటం అంటే
భగవంతుని మెప్పుపొందటమే!
అందుకోసం    మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము.

కర్మాచరణం కూడా  త్రికరణశుద్ధి గా చేయవలసి వుంటుంది.
అప్పుడే అది ధర్మంమవుతుంది.
త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా  వైరుధ్యం
లేక పోవటమే!
ఆకలితో  ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం
అప్పుడు
వండిసిద్ధంచేయటం వడ్డించటం  శరీరకర్మ.
అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి
ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం
వాచా కర్మ.
అలా చేస్తున్నందుకు తృప్తిపడుతూ ఆనందించటం
మానసిక కర్మ
అటువంటి పూర్ణ ధర్మాచరణమే దైవప్రీతమైన కార్యమన బడుతుంది
ఇలా  త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే కర్మాచరణంతో ముడివడిన ధర్మాచరణం సంపూర్ణసార్థక్యం చెందుతుంది.

ఇచ్చట మనసే ప్రధానమైనది .మనసులో  అయిష్టత వైరుధ్యం వున్నప్పుడు ----   వండటంలోనూవడ్డించటం లోనూ భోజనానికి పిలవటం లోనూ కొసరటంలోనూ మాటల్లోనూ
తృప్తిగా ఆనందించటంలో  మనసులోనూ  భోజనం పరిమాణం ,రుచులు,నాణ్యతలలోను ప్రభావం కనిపించవచ్చు.
అటువంటి  ధర్మాచరణం     మానవులదృష్టిలో ధర్మ కార్యమన బడవచ్చును కాని  దైవం మెచ్చదు.

దైవప్రీత్యర్హమైనధర్మాచరణం ఒకచో  -- విధ్యుక్త ధర్మం- స్వీయకర్తవ్యం  కావచ్చును.

ఐనప్పటికిని -అది పూజలువ్రతాలకన్నను జపతపాదికాలకన్నను యజ్ఞహోమాదికాలకన్నను  అత్యంతపవిత్రమైనదై దైవాన్ని మెప్పిస్తుంది.

ముఖ్యంగా వృత్తిరీత్యా దీనులను ఆదుకునే స్థానంలో
కర్తవ్యాన్ని విధ్యుక్తధర్మాలను  నిర్వహించే వారైనా ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ఇతరత్రా స్వయంగా అటువంటి బాధ్యతలు నిర్వహించే వారైనా ---
తమకు ప్రాప్తించిన అధికారాన్ని, వృత్తినైపుణ్యాన్ని దేవుడు మనకు ఇచ్చిన వరంగాప్రసాదించిన మహిమగా భావించాలి.

ఆ విధంగా  మనకు తన మహిమల్ని మనకు ఇచ్చి -- మనుషుల దైన్యాలను దూరం చేసే అవకాశాన్ని మనకు ఇచ్చాడని గ్రహించాలి.

ఆ విధంగా మనుషులకు సేవ చేస్తూ దేవునికి  దేవుని కృపకు దీనులను మరింత చేరువచేస్తూ భగవంతుణ్ణి
మనం మెప్పించ గలగాలి.
అప్పుడే  మన జన్మసార్థకమౌతుంది.

దీనులంటే రోగములచే గాని ఇతరత్రా కష్టములచే గాని పీడింపబడుతూ భగవంతుని శరణువాడే వారే కదా!
వారు బాధలనుండి రక్షిస్తారన్న ఆశతో-- వైద్యులవద్దకుకాని,సంబంధిత అధికారుల వద్దకు గాని వస్తూవుంటారు.
అలా బయలుదేరుతూ వారు--
"దేవుడా! మేము వెళ్ళిన చోట ఆ వైద్యులు లేదా అధికారులు  సిద్ధంగా వుండేట్లుచూడు  వాళ్ళు వెంటనే మా బాధల్ని తొలగించేట్లు చూడు"

అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తారు. అలా కష్టాలు తీరితే--

" దేవుని దయవల్ల   సులభంగా  మాకు   మేలు జరిగింది" అని దేవుణ్ణి తలుచుకుంటారు.

దేవుడు కూడా ---
"ఫలానా వ్యక్తికి వైద్యునిగా  లేదా అధికారిగా విధులునిర్వర్తించే అవకాశం శక్తి మహిమ
ఇచ్చినందువలన లోకానికి మంచి జరిగింది "
అని భావిస్తాడు.

ఆ విధంగా విధ్యుక్తధర్మం,కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించేవారికి   మరో జన్మలో కాని అదే జన్మలో గాని  ఇంకా మంచి వృత్తినైపుణ్యాలను, అధికారాలను ప్రసాదిస్తాడు దేవుడు.

దేవుడు అటువంటి వారికి అత్యున్నత స్థితులను కల్పిస్తూ ఇహలోక సంబంధమైనమైన అష్టైశ్వర్యాలను స్వర్గసుఖాలను కల్పిస్తాడు.అటుపై ఏకంగా అటుపై మోక్షప్రాప్తినిస్తాడు.

అందుకు విరుద్ధంగా కర్తవ్యాలను విస్మరించే వారు  దీనులకు తటస్థిస్తే  దీనులు దిక్కుతోచక  "దేవుడా నీవు దీనబాంధవునివని నిన్ను ప్రార్థించి బయలుదేరితిమే ఎందుకు ఇలా చేసితివి తండ్రీ! నీ దయ మాపై చూపలేదేమి "
అంటూ దేవునితో మొఱపెట్టుకుంటారు.

దయతో ప్రసాదించిన విద్యావకాశములచే ఉద్యోగావకాశములచే దీనుల కష్టాలనుతీర్చే శక్తిని మహిమను అధికారములను పొందిన వారు  --ధర్మాన్ని మరచిపోయిన ఫలితంగా
మరుజన్మంటూ వుంటే  వారికి దైవీయమైన పై నైపుణ్యాలను అధికారాలను  ఎట్టి పరిస్థితులను ప్రసాదించడు.

దైన్యం అంటే ఏమిటో వారికి అర్థం అయ్యేలా అటువంటి కర్తవ్యద్రోహులకు దీనాతి దీనులుగా
జన్మను ప్రసాదించి తనను ప్రార్థించి తనకు చేరువై
దీనజనరక్షణావశ్యకతను గుర్తించేలా అనుగ్రహిస్తాడు.

మానవులమైన మనమైనా మనకు చెడ్డపేరు తెచ్చిపెట్టే కన్నబిడ్డలకైనా అధికారాలను బాధ్యతలను అప్పగించలేముకదా!
       ***             **            ***
దీనబాంధవుడైన భగవంతుని ప్రీత్యర్థం కర్తవ్యపాలనంలో భాగమైన విధ్యుక్త ధర్మాల్ని
త్రికరణశుద్ధిగా నెరవేర్చటం మన ధర్మం. అదే మానవధర్మం కూడానూ.

---సహస్రకవిరత్న, సహస్రకవిభూషణ
శ్రీమతి జి సందిత  బెంగుళూరు